జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు చేపట్టే ఎన్నికల ప్రచారానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. శుక్రవారం ఉదయం నుంచి పార్టీ ముఖ్యులతో ఈ అంశంపై చర్చించారు. శ్రీ పవన్ కల్యాణ్ గారు పోటీ చేయనున్న పిఠాపురం నుంచే ప్రచారానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించుకున్నారు. శక్తిపీఠం కొలువైన క్షేత్రం... శ్రీపాద శ్రీవల్లభుడు జన్మించిన పవిత్ర భూమి అయిన పిఠాపురం నుంచి ప్రచారం మొదలుపెట్టడం శుభప్రదమని పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. పురుహూతిక దేవికి పూజలు నిర్వహించి వారాహి వాహనం నుంచి ప్రచారం మొదలుపెడతారు. ఆ నియోజక వర్గంలోనే మూడు రోజులపాటు ఉంటారు. నియోజక వర్గ ముఖ్య నాయకులు, మండల నాయకులతో భేటీలు నిర్వహిస్తారు. పిఠాపురం కేంద్రంగానే రాష్ట్రవ్యాప్తంగా సాగించే ఎన్నికల ప్రచారానికి రాకపోకలు సాగించబోతున్నారు. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని శ్రీ పవన్ కల్యాణ్ గారు పార్టీ కేంద్ర కార్యాలయ వర్గాలకు ఆదేశాలిచ్చారు. అనంతరం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పార్టీ ప్రెసిడెంట్ టూర్ మేనేజ్మెంట్ టీం కన్వీనర్లు, కో కన్వీనర్లు, సభ్యులతో శ్రీ పవన్ కల్యాణ్ గారు సమావేశమయ్యారు. పిఠాపురం నుంచి మొదలుపెట్టనున్న ప్రచారంపై దిశానిర్దేశం చేశారు. తాను పోటీ చేస్తున్న స్థానం కావడంతో వైసీపీ ఎన్నో పన్నాగాలు పన్నుతోందని... ప్రతి దశలోనూ అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయి... ఇందుకోసం సాగిస్తున్న ఈ సమరంలో కచ్చితంగా విజయం మనదే అని చెప్పారు. పిఠాపురం నుంచే జనసేన శంఖం పూరిస్తుందని... ఈ విజయ నాదం రాష్ట్రం నాలుగు వైపులా వినిపించాలన్నారు. ఎన్నికల నియమనిబంధనలు పాటించడంపైనా టూర్ మేనేజ్మెంట్ సభ్యులు పూర్తి అవగాహనతో ఉండాలని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ బి.మహేందర్ రెడ్డి, పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ కన్వీనర్ శ్రీ కళ్యాణం శివ శ్రీనివాస్ పాల్గొన్నారు.