వీర మహిళలు జనసేనకు వెన్నుదన్ను • పార్టీలో మహిళా నాయకత్వాన్ని బలోపేతం చేస్తాం • జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా వీర మహిళల ఎదుగుదలకు జనసేన పార్టీ ప్రాధాన్యమిస్తుందని పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. వీర మహిళలు పార్టీకి మొదటి నుంచి వెన్నుదన్నుగా నిలిచారని, ప్రజా పోరాటాల్లోనూ ముందు వరుసలో నిలబడ్డారని తెలిపారు. పార్టీ కోసం నిలబడిన వీర మహిళలను పార్టీ మర్చిపోదని భరోసా ఇచ్చారు. బుధవారం సాయంత్రం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో వివిధ కమిటీల్లో ఉన్న వీర మహిళలకు నియామకపత్రాలు అందచేశారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ "కులం, మతం, ప్రాంతాలు దాటి మహిళా నాయకత్వాన్ని పూర్తి స్థాయిలో బలపర్చే బాధ్యత తీసుకుంటాను. పార్టీకి, పాలనకు వారధిగా నిలిచేలా వారి సేవలు ఉపయోగించుకుంటాము. ప్రజా క్షేత్రంలో వీర మహిళలు చేసిన పోరాటాలు ఎప్పటికీ మరువలేము. అపజయంలోనూ వెనక్కి తగ్గకుండా గత అయిదేళ్లుగా వీర మహిళలు పార్టీ ఉన్నతి కోసం కష్టపడిన తీరు గొప్పది. మీ మద్దతు ఇలాగే కొనసాగించాలి. కూటమి అభ్యర్ధుల విజయానికి పూర్తి స్థాయిలో పని చేయాలి" అన్నారు.