పిఠాపురం నియోజకవర్గంలో చేనేత కార్మికులు పడుతున్న సమస్యల పట్ల జనసేన ఆర్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి పూర్తి అవగాహన ఉన్నదని, నేతన్నల ఆశయాలు నెరవేర్చడానికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మంచి ప్రణాళికతో ఉన్నారని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కె. నాగబాబు గారు స్పష్టం చేశారు. నేతన్నల కోసం మాత్రమే కాకుండా పిఠాపురం శాసనసభ్యులుగా పిఠాపురం నియోజకవర్గాన్ని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతారని వెల్లడించారు. డీ.కే. చైతన్య ఆది కేశవులు గారి నేతృత్వంలో మంగళవారం పిఠాపురంలో జరిగిన పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ, యూ కొత్తపల్లి మండలాల చేనేత సంఘాల ఆత్మీయ సమావేశంలో శ్రీ నాగబాబు గారు మాట్లాడారు. ఇటీవల తమను కలిసిన వీవర్స్ ఫెడరేషన్ సభ్యులు తమతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న స్థితిగతులు చూస్తుంటే 2019కు ముందు ఉన్న పరిస్థితి చాలా ఉత్తమం అనిపిస్తోందని, అలాంటి పరిస్థితులు మళ్ళీ రావాలని ఆశిస్తున్నట్లు చెప్పారని అన్నారు. అగ్గి పెట్టెలో పట్టే అంత చీరను తయారు చేసి దేశ అధ్యక్షులకు కానుక ఇచ్చిన ఘనత సాధించిన చేనేత కార్మికుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి బాధాకరమని అన్నారు. చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు కృషి చేయాలని చెప్పారు. ఒక్క రూపాయి ఇచ్చి పది రూపాయలు కార్మికుల శ్రమను వైసీపీ ప్రభుత్వం దోపిడీ చేస్తోందని చెప్పారు. చేనేత వస్త్రాల తయారీ ద్వారా రావాల్సిన సబ్సిడీ కూడా నేతన్నల దక్కట్లేదని, ప్రభుత్వమే దళారీ వ్యవస్థను పంచి పోషిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వంలో చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని శ్రీ నాగబాబు గారు ప్రకటించారు.